17, జూన్ 2018, ఆదివారం

సరి తూగే తూకం ..
సమానత్వమా...
ఎక్కడ నీవు..
స్త్రీ పురుష ప్రపంచంలో ..
సరితూగే తూకం అయినావా...
రాచరికపు రోజుల్లో అంతఃపుర కాంతలు ...
సర్వాలంకారాల సౌందర్య విరిబోణులయినా ..
మహారాజు పట్టపురాణులు కదా..
కాలు కిందపెడితే కందిపోవు సుకుమారిణులు కదా..
అయినా విద్యలన్నిటిని నేర్చిన అపర సరస్వతులే కదా..
ఆనాడు సమానత్వం అన్న మాటకి తావు ఉండినదా...
ఇంటికి ఇల్లాలు అయిన పడతి..
అత్తమామల ఇంట కంటి దీపమై వెలుగుతూ ..
తానో సేవికగా సపర్యలు చేసినా..
మగని మనసెరిగి మెసులుతూ..
పిల్లాపాపలతో కళకళలాడే ఇంట
సమానత్వం అన్న మాటకి తావు ఉండినదా ....
అమ్మాయి అబ్బాయి ఒక్కతీరుగా చదువుకుంటూ..
ఉద్యోగాలలోనూ ఒకరికి ఒకరు పోటీ పడుతూ ..
ఉన్నత స్థాయిలో రాణిస్తూ ..అహర్నిశలు సమయాన్ని
ఐదంకెల జీతానికై వెచ్చిస్తూ ..కుటుంబాన్ని భారం చేసుకుని
నేను భార్య..నేను భర్త ..అన్న ఇగోల నడుమ ..
సమానత్వమా..నీవు ...
సరితూగే తూకం అయినావా...!!
పక్షులు
ప్రకృతమ్మ ఒడిలో పుట్టి..
తమనే ఒక భాగంగా ప్రకృతిలో లీనం చేసి..
ఉదయ సంధ్యలను అనుభవిస్తూ..
కిల కిల రావాలతో తరాల అంతరాలను తట్టుకుంటూ
జీవనం సాగిస్తున్నాయి అనేక రకాల పక్షులు ..
గుబురు గుబురు చెట్లలో ..
కొమ్మలపై తమ గూళ్ళు కట్టుకుని..
ప్రేమ జంటలకు సాక్ష్యాలుగా
మురిపాలు పంచుకుంటూ గుడ్లు పెట్టి..
పొదిగి పిల్లలను ప్రేమతో పెంచుకుంటాయి పక్షులు ..
కాలాలకు..ఋతువులకు అనుగుణంగా
తమ జీవన విదానాన్ని మార్చుకుంటాయి..
అయినా ఒక్కోసారి హోరుగాలులు ...
ఎడతెరిపిలేని వర్షాలు..తుఫానుల తాకిడికి
తట్టుకోలేని అల్ప ప్రాణులు పాపం పక్షులు..
మనుషులే రాక్షసులై .. ..
స్వార్ధపు పొరలు కమ్మి ..
అవసరాలకు చెట్లను నరికేస్తూ ..
ఎన్నో మూగజీవాల ఆత్మఘోషలకు
కారణమవుతున్నారు ..
అడవులు మాయం అయిపోతున్నవి..
అదే స్థానంలో ఎత్తైన భవనాలు తాయారు అవుతున్నవి...
ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో
ఏ దూరతీరాలలో వలసపోతూఉన్నవి పక్షులు ..
అంతరించి పోతున్న పక్షిజాతిని రక్షించు కుందాం..
రెక్కలతో గాలిని అదుపు చేసుకుంటూ
వినువీధిని విహరించే ఆ విహంగాల చుట్టూ
మన ఆలోచనలు పరిభ్రమింపజేస్తూ..
మనము పక్షులమై పరవశించుదాం..!!
అమె వనిత
బ్రహ్మ తన అంశను పంచి ఆడపిల్లగా మలిచాడు
అతని వంతు సృష్టి చేస్తుంది ఆమె వనితగా రూపు దిద్దుకుని
పూవులలోని సుకుమారత్వాన్ని ఆపాదించుకుని
ఇంద్రధనుస్సు రంగులలోని సౌందర్యాన్ని ఆణువణువూ అద్దుకుని
ధరణి తల్లి నుంచి వారసత్వంగా సహనాన్ని అందుకుని
అవతరించింది అమె వనితగా రూపు దిద్దుకుని
బాల్యంలో తల్లితండ్రుల చాటు పిల్లగా పెరుగుతూ
యవ్వనంలో పెళ్లి అన్న బంధంతో ముడివేసుకుని
తనవారిని పరాయి చేసుకుంటూ భర్త వెంట నడచి
అతనిగా మారిపోతుంది అమె వనితగా రూపు దిద్దుకుని
తాను అమ్మగా మారి తన పిల్లలకు జన్మ నిస్తుంది
వారి ఆలనలో పాలనలో అన్నీ మరిచి జీవిస్తుంది
ఆపద సమయంలో తనో ఆలంబనగా మారి
ఇంటిని కాపాడుకుంటుంది ఆమె వనితగా రూపుదిద్దుకుని
కత్తి పట్టిన వీరనారీమణుల గాధల్లోనూ చిరస్మరణీయం అమె
కలం చేతబూని కావ్య రచనలు చేసిన అక్షర సుమాలలోను అమె
ప్రజారాజ్య పరిపాలనలోను సాటిలేని మేటి అమె
అబలని అలుసు మాని గుర్తించు ఆమెని
పూర్ణత్వాన్ని నింపుకున్న వనితగా ...
బహు రూపాల రూపసి అమె వనిత ...!!


చిన్ని ప్రపంచం ..
చీకటి చెరలో చిక్కిన సూరీడు
ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయి 
ముడుచుకు పోయిన తన కిరణాలను విప్పారిస్తూ ..
ఆ చెరని చేధిస్తున్నాడు జేగురురంగు మొహం వేసుకుని ..
ఆ బాల భానుని ఒడిలోకి తీసుకుంటూ ..
తూరుపమ్మ ఓదారుస్తుంది ఓపికగా..
చిన్ని పంజరం అయినా..
యజమానులు వేసిన దానాను 
పంచుకుని తింటూ..
ఎన్ని గుస గుసలో..
ఎన్నెన్ని ఊసులో ..
ఇతరులకు ఎవరికీ అర్ధం కానివి 
మూడు సంవత్సరాలు 
ఇతర ప్రపంచం ఎరుగవు ఆ జంట పక్షులు 
కాలం ఏ జంటను అయినా విడదియక మానదు ..
పాపం ..
తెలియని జబ్బు చేసి ఓ రోజు 
అలా తన దేహం వదిలి వెళ్ళిపోయింది ఓ పక్షి ..
తన జోడు ఎందుకు పలకటం లేదు 
అన్న అయోమయంలో మరో పక్షి..
హృదయం నీరై ..రోధిస్తుంది..
ఈ దృశ్యం చూసిన ఆ చేయి ..
"వెళ్ళు నేస్తం ..
ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది..
వీనీల ఆకాశంలో స్వేచ్చగా విహరించు ..
నీలో దాగిన ఈ భాదను మరచి ..
వింత వింత విచిత్రాలను చూస్తూ ..
నిన్ను నీవు కాపాడు కుంటూ ..
నీ పయనం సాగించు నేస్తం .."
అంటూ ఆ పంజరాన్ని తెరిచి పట్టుకుంది..
ఈ చిన్ని పంజరమే తన మహలు గా ఎంచిన ఆ పక్షి 
ఎటు పోవాలో తోచక ఎగర లేక ఎగురుతుంది...
అదిగో...!!

విడివడిన కురులను లెక్కచేయక..
దారంతా పరుచుకున్న గులకరాళ్ళను ...
అక్కడక్కడా చేరి నిలిచిన ముళ్ళ పొదలను
చూసుకోక రక్తసిక్తమైన పాదాల అడుగులతో ..
నిలువలేని ప్రాణాన్ని చిక్కబట్టు కుంటూ..
పరుగు పరుగున వచ్చి చేరితిరా కృష్ణా...
నీ బాహువులలో బందీగా నిలచిన ఈ క్షణం
ఇలా స్తంబించిపొతే ఎంతబాగుండు..
ఏ చిత్రకారునుని కుంచె నుంచి జాలువారిన చిత్రంలా...
ఏ శిల్పి ఉలితో చెక్కిన శిల్పంలా...
చిరస్తాయిగా..అమరమై నిలిచిపోతే...చాలు కృష్ణా..


ఎన్ని అందాలో 
మన ఆనందాల వెన్నెల్లో..
అవి అన్ని కాలంతో పాటే 
మనకు సొంతమైనాయి 
ముదిమి వయసులోనూ 
ముచ్చటలను తీరుస్తూ..

కన్నులు కమలాలయినవి ..
నీ చూపులే భానుని కిరణాలనుకుని..
. శ్రీ లక్ష్మి ఆసనం కమలమే..
శ్రీనివాసుని ఎదపై చేరి నిలిచినది..
కొలనంతా విరిసిన కమలాలు ..
చుట్టూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ భ్రమరాలు ..